మూసాపేట, ఏప్రిల్ 8 : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పని చేయాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. మండల ఆదర్శ మహిళా సమాఖ్య భవనంలో గురువారం ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పథకంలో నేటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని జానంపేట, నిజాలాపూర్ ఎంపీటీసీలు నక్క ఆంజనేయులు, సీజీ గోవర్ధన్ సభ దృష్టికి తెచ్చారు. గత సమావేశంలో నల్లా కనెక్షన్ల సమస్యను తెలియజేసినా అధికారులు పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతులపై నివేదిక తయారు చేసి అధికారులకు సమర్పించినట్లు ఎంఈవో రాజేశ్వర్రెడ్డి చెప్పారు. దీనిపై ఎంపీటీసీ ఆంజనేయులు స్పందిస్తూ పాఠశాలల్లో ఎస్ఎంసీ చైర్మన్లతో కలిసి నివేదికలను తయారు చేస్తే బాగుంటుందని, ఇంట్లో కూర్చొని నివేదికలు తయారు చేస్తే విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందన్నారు. మిషన్ భగీరథ పథకంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని చక్రాపూర్ సర్పంచ్ శైలజారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాలకు ఎవరైనా అధికారులు వెళ్తే సర్పంచు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం సేకరణ సమయంలో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. కాగా, చక్రాపూర్ గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ శైలజారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సతీశ్కుమార్రెడ్డితోపాటు ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో సరోజను ఎంపీపీ, జెడ్పీటీసీ సన్మానించారు. సమావేశంలో తాసిల్దార్ మంజుల, ఏవో రాజేందర్రెడ్డి, ఏఈలు నరేందర్గౌడ్, లక్ష్మణ్గౌడ్, స ర్పంచులు స్వరూప, శ్రీనివాసులు, చంద్రశేఖర్, భాస్కర్గౌడ్, సాయిరెడ్డి, నిర్మల, ఎంపీటీసీలు ఆంజనేయులు, సీజీ గోవర్ధన్, సుకన్య ఉన్నారు.