NRI News | అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక ఓలాథే నార్త్ వెస్ట్ హైస్కూల్లో ఇటీవల ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 650 మంది తెలుగు వారు పాల్గొన్నారు. స్థానిక హిందూ ఆలయ పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేశారు.
చక్కని ప్రార్థనా గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమ వ్యాఖ్యాతలుగా రఘు వేముల, చందన తియగూర, శ్వేత అడుసుమిల్లి వ్యవహరించారు. చిన్నవారు, పెద్దలు కూడా తెలుగు సంప్రదాయాన్ని సూచించే కూచిపూడి , భరత నాట్యంతోపాటు చక్కని జానపద, శాస్త్రీయ నృత్యాలతో ఆహుతులను అలరించారు. వీటితో పాటు ఈ మధ్య ప్రాచుర్యం పొందిన “కుర్చీ మడత పెట్టి,పల్సరు బండి” పాటలకు చిన్నారులు, పెద్దవారు చేసిన నృత్యాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చాయి.
తొలుత అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు గంట స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర యక్కలి, కొత్త ట్రస్ట్ సభ్యులను ట్రస్ట్ చైర్మన్ శివ తియగూర అందరికీ పరిచయం చేశారు.
టీఏజీకేసీ అధ్యక్షుడు చంద్ర యక్కలి మాట్లాడుతూ తెలుగు ప్రత్యేకతను గుర్తు చేశారు. పిల్లలూ పెద్దలంతా ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాఫెల్స్ (Raffles) కార్యక్రమ విజేతలకు బహుమతులు అందజేశారు.
టీఏజీకేసీ ఉపాధ్యక్షులు శ్రావణి మేక ధన్యవాదాలు తెలిపారు. జనగణమన గేయాలాపనతో కార్యక్రమం ముగిసింది. చివరిగా అందరూ చక్కని తెలుగు భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అసోసియేషన్ కార్యకర్తలు, స్పాన్సర్లు, ఫోటోగ్రాఫర్ కార్తీక్, వీడియోగ్రాఫర్ సూర్యలకు టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్ట్ బోర్డు కృతజ్ఞతలు తెలిపారు.