Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉద్యానవనాలు, గోశాలల నిర్వహణ తీరును ఈఓ డీ పెద్ది రాజు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ డీ పెద్ది రాజు మాట్లాడుతూ, రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నదని, గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. గోశాల ప్రాంగణంలో ఇప్పటికే గోవుల సంరక్షణ కోసం చలువ పందిళ్లు వేశారు. ఎప్పటికప్పుడు గోవుకుల తగినంత మేత వేయడంతోపాటు అధికంగా తాగునీరు అందించాలన్నారు. అవసరమైతే గోవుల కోసం మరిన్ని నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. గోశాలలో శుచీశుభ్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. దీనివల్ల గోశాలలో పవిత్ర వాతావరణం నెలకొంటుందన్నారు.
ముఖ్యంగా గోవులకు అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా, వాటికి కాలానుగుణంగా టీకా మందులు వేయాలని సిబ్బందిని ఈఓ డీ పెద్దిరాజు ఆదేశించారు. గోవుల సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నీ తగినంత మేరకు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. గోశాలలో నీడ నిచ్చేందుకు పలు రకాల మొక్కలు నాటారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని ఉద్యానవన సిబ్బందిని ఆదేశించారు.
భ్రామరీ పుష్పవనం, భ్రామరీ పుష్పవనం వెనుక ఇటీవల ఐదెకరాల విస్తీర్ణంలో వేసిన పండ్ల తోటలను ఈఓ డీ పెద్దిరాజు పరిశీలించారు. ఈ పండ్లతోటల్లో మామిడి, నిమ్మ, బత్తాయి, సపోటా తదితర పండ్ల చెట్లు పెంచుతున్నారు. పూలతోటలు, పండ్ల తోటల ఉద్యానవనాల్లో ఎప్పటికప్పుడు మొక్కలు తొలగిస్తూ ఉండాలని ఉద్యానవన సిబ్బందిని ఆదేశించారు. అన్ని తోటల్లో కూడా మొక్కలకు తగినంత నీరు పెడుతుండాలని చెప్పారు. ఎక్కువగా బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) విధానాన్ని అవలంభించాలని అన్నారు.
తోటలు, ఉద్యానవనాల్లో పని చేస్తున్న సిబ్బంది సౌకర్యార్థం అన్ని తోటలు, ఉద్యానవనాల్లో చలివేంద్రాల తరహాలో వెంటనే నీటి కుండలను ఏర్పాటు చేయాలని ఈఓ డీ పెద్దిరాజు అన్నారు. అలాగే తోటల్లో పని చేసే సిబ్బందికి వెంటనే దేవస్థానం నుంచి టోపీలు అందజేయాలన్నారు. ఇక వలయ రహదారి మార్గంలో ప్రజలకు నీడనిచ్చేందుకు నాటిన మొక్కల సంరక్షణకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉద్యానవన విభాగం రిటైర్డ్ సహాయ సంచాలకులు ఈశ్వరరెడ్డి, సహాయ ఇంజినీర్లు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.