మహబూబ్నగర్ : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాలకు దిగారు. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన తెలుపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా.. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్-బెంగుళూరు(భూత్పూర్) జాతీయ రహదారిపై టీఆర్ఎస్ చేపట్టిన రాస్తారోకో రాస్తా రోకోలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, జైపాల్ యాదవ్, ఎస్ ఆర్ రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు,బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్ పై బైఠాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్లుగానే తెలంగాణ ధాన్యాన్ని కొనాలన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.