(స్పెషల్ టాస్క్ బ్యూరో)
నాందేడ్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో మొదటిసారి ఏర్పాటు చేసిన చేరికల సమావేశం గురించి ఇక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చించుకొంటున్నారు. 5న జరుగబోయే బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం గురించి, తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. నాందేడ్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల మనోభావాలు తెలుసుకోగా, చాలా మంది మహారాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ లాంటి నాయకుడుంటే దేశం బాగుపడుతుందని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు లాంటి పథకాలుంటే ఇక రైతులకు కావాల్సిందేమిటని రైతులు అంటున్నారు. పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను వాహనాలపై వెళ్తున్న వారు ఆగి మరీ చదువుతూ కనిపించారు. నాందేడ్ జిల్లా కేంద్రంలో రెండు శాసనసభ నియోజకవర్గాలుండగా, జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
నాందేడ్(2), భోకర్, కిన్వట్, దెగ్లూర్, హిమాయత్నగర్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నయీగావ్ ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జట్లుగా విడిపోయి ఆయా నియోజకవర్గాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ప్రజలు తెలంగాణ సర్కారు, సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకొంటున్నారు. నాందేడ్ జిల్లా ప్రజలకు తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయి. తెలంగాణ పథకాలపై వారికి అవగాహన ఉండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వయోజనులు వృద్ధాప్య పింఛన్ల గురించి తెలుసుకొంటున్నారు. తెలంగాణలో ప్రతినెలా రూ.2 వేలు వృద్ధాప్య పింఛన్ పొందుతుంటే, తమకు రూ.500 మాత్రమే అందుతున్నాయని బాధపడుతున్నారు. ‘కేసీఆర్ ప్రభుత్వం రావాలి.. నాం దేడ్ రూపురేఖలు మారాలి’(కేసీఆర్ ఆనా.. నాందేడ్కా నక్షా బదల్నా) అని కోరుకుంటున్నా రు. తెలంగాణలో అమలు చేస్తున్న షాదీముబారక్, మైనార్టీ గురుకులాలు తమకు కూడా అమ లు చేస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు.
కేసీఆర్ దూర్ కా సోచ్తే హై
హైదరాబాద్లో చాలా మంచి ప్రభుత్వం ఉంది. మా తమ్ముడు అక్కడే ఉంటాడు. నేను కూడా చాలా సార్లు వెళ్లా. అక్కడి ప్రభుత్వానికి, ఇక్కడి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణలో పేద ముస్లిం విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందజేస్తున్నారు. దాంతో వచ్చే తరం బాగుపడుతుంది. కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడు.(కేసీఆర్ బహుత్ దూర్ కా సోచ్తే హై). అలాంటి నాయకుడు ఉంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
– షేక్ రహీం, ఆటో వాలా,దెగ్లూర్ నాకా, నాందేడ్
ఇప్పుడే పార్టీలో చేరుతా..
బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకున్నా. ఇప్పుడే బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటా. బీఆర్ఎస్ జెండా పట్టుకొని, అందరికంటే ముందు నడుస్తా. తెలంగాణలో చాలా మంచి పథకాలున్నాయి. అలాంటి ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంటే ఎంతోమంది పేదలు బాగుపడుతారు. కేసీఆర్ టైగర్ హై.. దేశ్ కా నేతా హోనే కా కాబిల్ హై కేసీఆర్.
– అబ్దుల్ బారీ, ఆటో డ్రైవర్, గాడీపుర, బడీదర్గా, నాందేడ్
కేసీఆర్ ఆనా జరూరీ హై..
తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ చాలా చేస్తున్నారు. అబ్కీ బార్.. కిసాన్ సర్కార్.. నినాదం చాలా బాగుంది. ఆయనలాంటి సీఎంను నేను అయితే ఎక్కడా చూడలేదు. ఆనే వాలే ఎలక్షన్మే మై బీఆర్ఎస్కు ఓట్ దూంగా.(వచ్చే ఎన్నికల్లో నేను కూడా బీఆర్ఎస్ కే ఓటు వేస్తా).. అబ్ దేశ్మే కేసీఆర్ ఆన జరూరీ హై(ఇప్పుడు దేశంలో కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది.)
– ఓం ప్రకాశ్ భోసీకర్, రైతు, బంగి కాలనీ, నాందేడ్
తెలంగాణలో పేదోళ్ల సర్కార్
తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. షాదీముబారక్ పథకం ఎందరో పేద ముస్లిం ఆడపిల్లలకు వరంగా మారింది. ‘శేత కరోంకో(రైతులకు) ఎక్కర్కు రూ.10 హజార్ దేరే’. మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ ఎప్పుడు వస్తారోనని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ వస్తున్నాడన్న సమాచారంపై హోటళ్లు, చౌరస్తాల్లో ఆయన గురించి చర్చించుకుంటున్నారు.
– అబ్దుల్ ఖదీర్, చిరు వ్యాపారి, బిలాల్నగర్, నాందేడ్
బీఆర్ఎస్తోనే దివ్యాంగ పెన్షన్ పెరిగింది
మొన్నటి వరకు మహారాష్ట్రలో దివ్యాంగ పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇక్కడి నాయకుల్లో గుబులు మొదలై, పెన్షన్ను రూ.2 వేలకు పెంచారు. వృద్ధులకు మాత్రం ఇంకా రూ.500 ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణలోని అన్ని పథకాలు మాకు అందుతాయనే నమ్మకం ఉంది.
– రాహుల్ మాధవ్ రావ్ కస్తూరే, దివ్యాంగుడు, తరోడా నాకా, నాందేడ్