ఖైరతాబాద్, జూలై 8 : ‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం రోడ్లెక్కి ఉద్యమించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అందరూ కలిసి ఒకచోట కూర్చొని సమావేశాలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఐక్యంగా ఉద్యమిస్తేనే అనుకున్నది సాధించవచ్చు’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి సూచించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కేవలం విద్యార్థుల సమస్య కాదని, బడుగు బలహీన వర్గాలను శాశ్వతంగా అణచివేసే కుట్రలో భాగమని పేర్కొన్నారు. దీనిని నిర్వీర్యం చేయడమంటే పేదవారి నోటికాడి ముద్దను లాక్కోవడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఎమ్మెల్సీ ఎల్ రమణ గుర్తుచేశారు.
గడిచిన 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారో, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉసురు తగిలి రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని మండిపడ్డారు. తాటికొండ విక్రమ్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం, బీసీ యువజన సంఘం జా తీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు నర్సింహనాయక్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.