హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పలేదని కుండ బద్ధలు కొట్టారు.
ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన నియామకాలకు ఇప్పుడు పత్రాలు అందిస్తూ.. ఆ నియామకాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్నదని చురకలు అంటించారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం… తాము నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఒప్పుకొంటూనే ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిన్ననే వార్నింగ్ ఇచ్చాం.. అయినా వారు మారడం లేదు’ అన్నారు.