ఉన్నతస్థాయి సమీక్షలో తెలంగాణ నిర్ణయం
రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నం. రెండు పంటలకూ నీరందాలంటే.. జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించిన నీటిని విద్యుదుత్పత్త్తి కోసం వినియోగించుకొంటాం. పలు ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేటాయించిన నదీజలాలను సాగునీటికి వాడుకోవటంతోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకోవాల్సిన అనివార్యతను అధిగమించడానికి.. కావాల్సిన జల విద్యుదుత్పత్తి కోసం కూడా.. తప్పకుండా, కేటాయించిన నీటిని వినియోగించుకొంటాం.
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూలై 3 (నమన్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తమ వాటాకింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకొనేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. జల విద్యుదుత్పత్తిని కూడా ఆపేదిలేదని స్పష్టంచేసింది. తెలంగాణ హక్కులను కాలరాస్తూ.. ఎలాంటి కేటాయింపులు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న నేపథ్యంలో గతంలో స్నేహపూర్వకంగా చేసుకున్న అవగాహన ఒప్పందాలు ఇక చెల్లవని.. కృష్ణా జలాల్లో కచ్చితంగా చెరిసగం వాటా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల వాటాను ట్రిబ్యునల్ కేటాయించేవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో చెరిసగం అంటే.. 405.5 టీఎంసీల చొప్పున వినియోగించుకోవాలని నిర్ణయించింది. తాత్కాలికంగా ఇప్పటివరకు 66ః34 నిష్పత్తిలో వాడుకొంటున్న కృష్ణాజలాలను ఇకపై సమానంగా వాడుకోవాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా, చట్టవ్యతిరేకంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ఎత్తిపోతలు, తెలంగాణలో జల విద్యుదుత్పత్తి తదితర అంశాలపై శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఒక చుక కూడా నీటి కేటాయింపులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నాకూడా.. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిసున్న చట్ట వ్యతిరేకమైన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని కుండబద్దలు కొట్టింది.
తెలంగాణ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీమాంధ్ర ప్రభుత్వాలు
ఈ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్రమట్టానికి చాలా ఎగువన ఉన్నది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి తెలంగాణకు ఉన్నది. దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని దండుగలా మార్చి, తెలంగాణ రైతులకు అన్యాయం చేసిండ్రు. పోరాటంచేసి సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రథమ ప్రాధాన్యంగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాగునీటి గోసను తీర్చింది. దీంతో అత్యధిక దిగుబడులతో తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచింది. ఇదంతా లిఫ్టుల ద్వారా నదీజలాలను ఎత్తిపోయడం వల్లనే సాధ్యమైంది. రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నం. రెండు పంటలకూ నీరందాలంటే.. జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించిన నీటిని, విద్యుదుత్పత్త్తి కోసం వినియోగించుకుంటాం. పలు ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేటాయించిన నదీజలాలను సాగునీటికోసం వాడుకోవడంతోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకోవాల్సిన అనివార్యతను అధిగమించడానికి.. కావాల్సిన జల విద్యుదుత్పత్తి కోసం కూడా.. తప్పకుండా, కేటాయించబడిన నీటిని వినియోగించుకుంటాం. ఇదే విషయాన్ని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది కూడా. దీనికి వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలనూ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదు. తెలంగాణ వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం. నదీ జలాలమీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హకుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. కేటాయింపులు లేని నికరజలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరు.’ అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.
ఎత్తిపోతలు అనివార్యం
తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదని, నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తి పోసుకోవాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణలో 30 లక్షలకు పైగా బోరు మోటర్లున్నాయి. తెలంగాణ మొత్తం విద్యుత్తులో 40% విద్యుత్తు సాగునీటి అవసరాలకే వినియోగించబడుతున్నది. తెలంగాణకున్న భూ పరిస్థితుల (terrain) దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుదుత్పత్త్తి కోసం కూడా నీరు అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేకసార్లు ప్రకటించారు. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు కూడా నాడు అదే విషయం చెప్పారు. నేడు మాట మార్చి పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హకులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సంయమనంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేనివిధంగా, సహకరిస్తూ నిర్మాణం చేసిందని, ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అవలంబించేందుకు స్నేహహస్తం చాచినప్పటికీ వారు పెడచెవిన పెట్టడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, జెనో డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దశాబ్దాలపాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదనీ, స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో రానివ్వబోమని సీఎం కేసీఆర్ అన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటివాటాను నిర్ధారించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతాం. బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే, ఇంకా సర్ప్లస్ వాటర్ వుంటే, ఇతర బేసిన్ అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయం. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించడం సరికాదు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నేపథ్యంలో.. జల విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగింది. జల విద్యుత్తో లిఫ్టులను నడిపి తద్వారా సాగునీటిని తెలంగాణ ఎత్తిపోసుకుంటుంది. సాగునీటితోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకునేందుకు జలవిద్యుదుత్పత్తిని కూడా తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటుంది. ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్ల ముందు, కేఆర్ఎంబీ వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం తన వాణిని వినిపిస్తుంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.