సూర్యాపేట, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే రాత్రికి రాత్రి హడావుడిగా మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదల అయిందని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలకు బీజేపీ పెట్టింది పేరని.. అందులో భాగంగానే మునుగోడుకు ఉపఎన్నిక తెచ్చారన్నారు. సోమవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్షా ఎన్ని కుట్రలు పన్నినా.. అంతిమ విజయం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీ బాద్షాలు సీఎం కేసీఆర్ పేరు వింటేనే హడలిపోతున్నారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తామంటూ అధికారికంగా ప్రకటించిన 24 గంటల్లోనే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిందని తెలిపారు. వాస్తవానికి అమిత్షా మునుగోడు పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎన్నికల ప్రకటన వస్తుందని భావించామని, కానీ, పరిస్థితులు బీజేపీకి ఆశాజనకంగా కనిపించకపోయేసరికి వాయి దా పద్ధతిని ఎంచుకొన్నట్టు అనిపించిందని చెప్పారు. నిజానికి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా అడ్డు పడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడే అడ్డా వేసినా గులాబీ పార్టీ గెలుపును ఆపడం వారి తరం కాదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్తో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని తేల్చి చెప్పారు.