హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 36 వ ఎడిషన్ ఒలింపిక్ డే రన్ – 2022 లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే సగానికిపైగా క్రీడా మైదానాలను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను 100 శాతం పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు.
అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాల్లో కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ కిట్లను అందించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడలను అభివృద్ధి చేసేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే ఒలింపిక్ డే రన్ ను సుమారు 50 వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.వేణుగోపాల చారి, రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శిసందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర SATS చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొ రేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్ తదితరులు ఉన్నారు.