సిద్దిపేట : రూపాయి ఖర్చు లేకుండా..మీ చెమట చుక్క పడకుండా.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి పేదలకు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా లోని గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో రైతు వేదిక, డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాల కార్యక్రమాలకు హాజరై లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బెజగామ గ్రామంలో 20 మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ దసరాకు ఇంటి జాగలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లు కట్టుకునేందుకు కేవలం రూ.60 వేల రూపాయలు ఇచ్చేదని, అవి బేస్మెంట్ కూడా సరిపోయేవి కావన్నారు.
పైగా మధ్య దళారులకు ఇచ్చే కమిషన్ పోగా లబ్ధిదారులకు నామమాత్రంగా డబ్బులు చేతికొచ్చేవని గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరును మంత్రి ఎండగట్టారు. గజ్వేల్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసి జిల్లా రైతుల ఎరువుల తిప్పలు సీఎం కేసీఆర్ తప్పించారని గుర్తు చేశారు.
కాగా, బెజగామలో 11 కేవీ విద్యుత్ లైను నూతనంగా కావాలని మంత్రిని గ్రామస్తులు కోరారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యుత్ లైన్ మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. బెజగామ రవి చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ వద్ద మెట్లు నిర్మించాలని కోరగా వెంటనే నిర్మిస్తామని గ్రామస్తులకు మంత్రి హామీనిచ్చారు.