హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ను విడదీసి చెరువులను అభివృద్ధి చేయాలని రైతు కమిషన్ పేర్కొన్నది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. తాజాగా శుక్రవారం చెరువుల అభివృద్ధి, నీటి సంఘాల ఏర్పాటుతోపాటు ఇతర అంశాలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో సమావేశమై చర్చించింది. నీటి సంఘాలను ఏర్పాటుచేసి చెరువుల నిర్వహణ బాధ్యత అప్పగించాలని కోరింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రంలో చిన్న నీటిపారుదల పునర్వ్యవస్థీకరణ కోసం రైతు కమిషన్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా మంత్రికి కమిషన్ బృందం అందజేసింది. చెరువుల అభివృద్ధి, పరిరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి.. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ సూచించిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమావేశంలో పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, చెవిటి వెంకన్న, భవానీరెడ్డి, భూమి సునీల్, కమిషన్ సెక్రటరీ గోపాల్తోపాటు ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ, నీటిపారుదల రంగాల నిపుణులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.