కొత్తగూడ, జూలై 17 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ విషయమై పలుమార్లు ఆర్సీవో రత్నకుమారికి విన్నవించినా పట్టించుకోకుండా, చెప్పుతో కొడతానంటూ దుర్భాషలాడుతున్నదని వాపోయారు. ఆర్సీవోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి కొరతతో కారణంగా ఉదయం అల్పాహారం కూడా చేయలేదని తెలిపారు. ఎంపీడీవో అనురాధ పాఠశాలను సందర్శించి తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు. ఆర్సీవో ప్రవర్తన తీరును ఉన్నతాధికారులకు నివేదిస్తానని, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.