నిజామాబాద్ : ఈ వానా కాలం సాగుకు సంబంధించి నిజాం సాగర్ ఆయకట్టుకు శనివారం సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బాన్సువాడలోని తన నివాసంలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో స్పీకర్ పోచారం శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం సాగర్ ఆయకట్టుకు మొత్తం 6 విడతలుగా నీటిని విడుదల చేస్తామని చెప్పారే. మొదటి విడతలో 1200 క్యూసెక్కులు విడుదల చేస్తామన్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత ఉంటుందన్నారు. 10 రోజుల చొప్పున మిగతా విడుతలను పూర్తి చేస్తామన్నారు. బోర్లు, బావుల కింద ఇప్పటికే రైతులు వరి నార్లు పోసుకున్నారు. ఆ నారు ముదరక ముందే నీటిని విడుదల చేసి రైతులు నాట్లు వేసుకునేలా చేస్తామన్నారు. నిజాంసాగర్ ఆయకట్టులో ఒక పంట సాగుకు 9 టీఎంసీల నీళ్లు అవసరం పడుతుందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.13 టీఎంసీల నీరు ఉందన్నారు. వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి కాబట్టి అంతగా ఇబ్బందులు ఉండవన్నారు. అత్యవసరమైతే సింగూరు, కొండపోచమ్మ సాగర్ల ద్వారా కూడా సాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు.