Sircilla | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) :రాజన్న సిరిసిల్ల జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నది. కేసీఆర్ పాలనలో పుష్కలమైన జలాలతో పచ్చని పంటలతో కనిపించిన ఆ జిల్లా, ప్రస్తుతం కరువుతో అల్లాడిపోతున్నది. సాగునీళ్లు లేక నెర్రలు బారిన నేలను గోదావరి నీళ్లతో అభిషేకిస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం నిలబెట్టుకున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేసి, కాళేశ్వర జలాలతో కరువును తరిమేశారు. పదేండ్ల పాటు సుభిక్షంగా ఉన్న మెట్ట ప్రాంతం నేడు దుర్భిక్షంగా మారింది. కాళేశ్వర జలాలు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంలు ఎండిపోయాయి. జీవనదిగా ఉన్న మానేరు ఎడారిగా మారింది. యాసంగిలో పంటలకు నీరందక కర్షకులు కన్నీరుపెడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి నీటిని ఎత్తిపోసి, ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా మూడు సార్లు మధ్యమానేరును నింపి యాసంగి పంటలు ఎండిపోకుండా చేసింది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి కూడా నీటిని విడుదల చేసి తంగళ్లపల్లి మండలంలోని నర్సింహులపల్లెకుంట, బాలుమల్లుపల్లె సోమయ్యచెరువు, జిల్లెల్ల పెద్ద చెరువు, బద్దెనపల్లి, అంకిరెడ్డిపల్లె చెరువులను నింపి సాగునీరందించింది. మల్లన్నసాగర్ జలాలను కూడెల్లివాగు ద్వారా తరలించి ముస్తాబాద్ మండలంలోని మద్దికుంటచెరువు, పెద్దచెరువు, గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టును నింపింది. ఇవే కాదు ప్రతి వేసవిలోనూ చందుర్తి, రుద్రంగి మండలాలకు ఎల్లంపల్లి జలాలు తెచ్చి వందల ఎకరాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరందించింది. జిల్లాలో గతంలో 90వేల పైచిలుకు సాగువిస్తీర్ణం ఉండగా, కాళేశ్వర జలాల రాకతో 2,40,430 ఎకరాలకు పెరిగింది.
జిల్లాలో ఉన్న మధ్యమానేరు సామర్థ్యం 27.50 టీఎంసీలు. నిరుడు ఇదే నెలలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సంవత్సరం 7.7 టీఎంసీలకు పడిపోయింది. 32 అడుగుల సామర్థ్యం ఉన్న ఎగువ మానేరు ప్రస్తుతం 16 అడుగులకు చేరింది. సుమారు రూ.200 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం సిరిసిల్ల మానేరుపై 12, వేములవాడ మూలవాగుపై 14 చెక్డ్యాంలు నిర్మించింది. వర్షపు నీటితోపాటు, చెరువులు మత్తళ్లు దూకిన నీటి నిలువతో గత యాసంగిలో నీళ్లతో కళకళలాడిన చెక్డ్యాంలు ప్రస్తుతం చుక్కనీరు లేక అడుగంటి పోయాయి. జీవనదులను తలపించిన మానేరు, మూలవాగులు ఎడారిగా మారాయి. కాళేశ్వర జలాలతో 100 అడుగుల నుంచి 200 అడుగలకే బోర్లలో పుష్కలంగా నీరుండేది. కొన్ని గ్రామాల్లో బోర్లలో గంగమ్మ ఉబికి వచ్చి పంటచేలను ముద్దాడేది. ప్రస్తుతం 500 నుంచి 700 అడుగులు బోరు వేసినా చుక్క నీరు రాని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లంతకుంట మండలంలోని అనంతారం, సిరికొండ, పెద్దలింగాపూర్, చందుర్తి, రుద్రంగిలో వెయ్యి ఎకరాల వరి ఎండిపోయింది. కాంగ్రెస్ వచ్చింది.. కరువొచ్చింది అంటూ కొందరు రైతులు ఎండిన పంటకు నిప్పు పెట్టి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.