హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వరంగల్లో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న దవాఖాన ఫోటోలను బుధవారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీతో వైద్యరంగ వికేంద్రీకరణలో ముందడుగు పడినట్టేనని కేటీఆర్ తెలిపారు. 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు అవుతున్నదని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో సీఎం కేసీఆర్ ముందుచూపునకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.