హనుమకొండ చౌరస్తా, జూన్ 6 : కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకుండా రేవంత్రెడ్డి సర్కార్ కాలయాపన చేస్తున్నదని, దీనిపై తాడోపేడో తేల్చేందుకు వరంగల్ కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సర్కార్పై యుద్ధమేనని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. రెండేండ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్లో పనిచేస్తున్న ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రమే సీఎం రేవంత్రెడ్డి బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఏడాది క్రితం బిల్లుల కోసం ధర్నా చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.
ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శాఖల్లో కలిపి రూ.3వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీనికి పెద్దసంఖ్యలో కాంట్రాక్టర్లు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. బిల్లుల చెల్లింపుల ఆలస్యంతో అనేకమంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని వాపోయారు. ఈనెల 18న చేపట్టే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ మాజీ స్టేట్ చైర్మన్లు బీ సుగుణాకర్రావు, కటుకూరి దేవేందర్రెడ్డి, యూ సురేందర్, రాష్ట్ర సలహాదారు ప్రభాకర్రెడ్డి, జనగామ సెంటర్ పాస్ట్ చైర్మన్ ఇమ్మడి దేవేందర్రెడ్డి, వరంగల్ సెంటర్ చైర్మన్ ఈ మనోజ్, జిల్లా నాయకులు ఎం ఐలయ్య, వీ రాజారెడ్డి, మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.