హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో ఏ ఒక వీఆర్వోకు నష్టం జరగదని, ధరణి వ్యవస్థను అమల్లోకి తెచ్చిన కారణంగా వీఆర్వో వ్యవస్థతో పనిలేనందునే వాళ్లను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వివరించారు. ఐదు వేల మంది వీఆర్వోల్లో 56 మంది మాత్రమే రెవెన్యూ శాఖలో ఉన్నారని, 98.9% మంది వేరే శాఖల్లో చేరిపోయారని చెప్పారు. వాళ్ల సేవలు అవసరమైన శాఖల్లో వినియోగించుకొంటే తప్పు కాదన్నారు. వీర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖలోనే కొనసాగుతామని కొందరు వీఆర్వోలు కోరడం అన్యాయమని బీఎస్ ప్రసాద్ అన్నారు. ధరణి పోర్టల్ను ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చిందని, కొత్త యంత్రాంగం అమలు చేస్తున్నందున వీఆర్వోలకు రెవెన్యూ శాఖలో పని ఉండదని స్పష్టంచేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ, వీఆర్వోలకు సంబంధం లేని రెవెన్యూ శాఖ జీవో 121 జారీ చేసిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రభుత్వానికి ఏవిధంగా దురుద్దేశాలను ఆపాదిస్తారని ప్రశ్నించింది. ఏవిధమైన నిబంధనలను రూపొందించకుండానే జీవో 121 ద్వారా బదిలీలు చేయడం చట్ట వ్యతిరేకమని న్యాయవాది జవాబు చెప్పటంతో జీవో 121 అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఆదేశాలను జారీ చేసింది.