Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రధాని మోదీ( Modi ) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సహకరించడం లేదని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )కు జాతీయ హోదా ఇవ్వాలని అనేకసార్లు అడిగామని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిపై కూడా అనేక లేఖలు రాశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఇవాళ హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన అమలవుతుందని మాట్లాడిన మోదీపై వినోద్ కుమార్ మండిపడ్డారు. కవిత, కేటీఆర్, హరీశ్రావు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పని చేశారు. మరి బీజేపీ నేతలు ఎక్కడ అని ప్రశ్నించారు. కుటుంబ పాలన అంటున్న మీరు మీ బీజేపీలో కుటుంబ సభ్యులు లేరా? అని నిలదీశారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఎవరు..? పీయూష్ గోయల్, సింథియా, అనురాగ్ ఠాకూర్ ఎవరు? అని ప్రశ్నించారు. రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే, అమిత్ షా కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్ కాదా..? వీళ్లు కుటుంబ సభ్యులు కాదా..? అని ప్రశ్నించారు. హరీష్, కేటీఆర్, కవిత తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడి పని చేసి ఈ స్థాయికి వచ్చారని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి మోదీ బద్దవ్యతిరేకి అని వినోద్ కుమార్ తెలిపారు. పాపం శుష్మ స్వరాజ్ ఒక్కరు మాత్రమే తెలంగాణకు సపోర్ట్ చేశారు. జాతీయ రహదారులపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించొచ్చు కదా? కానీ ఆ ఊసే లేదు. వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు. తిరుపతికి ఇంతకు ముందు రైళ్లను నడపలేదా..? ఇప్పుడు కొత్తగా ప్రారంభించేది ఏంది? అని ప్రశ్నించారు.
పేద ప్రజలు, రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు పథకాల్లో అవినీతి ఉందని మోదీ మాట్లాడటం సరికాదని వినోద్ కుమార్ మండిపడ్డారు. జన్ ధన్ ఖాతాలన్నారు. మరి వారి ఖాతాల్లో ఎందుకు డబ్బులు వేయలేదు? అని ప్రశ్నించారు. అవినీతిపరులను పట్టుకొస్తాం అన్నారు. ఎక్కడ పట్టుకొచ్చారని నిలదీశారు. అవినీతిపరులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు వారిచ్చిన డబ్బులతో ఇక్కడ ప్రభుత్వాలను కూల్చుతున్నారని వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.