హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు కేంద్రం ఒక్కపైసా అయినా ఇచ్చిందా? దీనిపై సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ నీతి ఆయోగ్ను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నీతి ఆయోగ్, కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేయగా.. దీనిపై నీతి ఆయోగ్ స్పందించింది.
ఈ క్రమంలో నీతి ఆయోగ్పై వినోద్కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. మిషన్ భగీరథకు రూ.19,250 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేలకోట్ల కలిపి.. మొత్తం రూ.24,250కోట్లు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి దాదాపు ఐదేళ్ల కిందట సిఫారసు చేసిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా రాష్ట్రానికి విడుదల చేయలేదన్న వినోద్కుమార్ ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశంలో తప్పు ఎక్కడ ఉందని నీతి ఆయోగ్ను నిలదీశారు. రెండు పథకాలకు కేంద్రం నయా పైసా కూడా ఇవ్వని మాట నిజం కాదా? సూటిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.