Banswada | బాన్సువాడ రూరల్, డిసెంబర్ 18: దొంగతనానికి పాల్పడి.. నిద్రలోకి జారుకొని ఓ దొంగ గ్రామస్థులకు చిక్కిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంక్యాంపులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బోర్లంక్యాంపు గ్రామానికి చెందిన కుర్మ రాజు దంపతులు ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లారు. తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన బత్తుల మోహన్ ఆదివారం అర్ధరాత్రి రాజు ఇంట్లో చొరబడి, బీరువాను ధ్వంసం చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి, ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.
దారి మధ్యలో నిద్ర రావడంతో గ్రామ సమీపంలోని ఓ చెట్టు కింద నిద్రకు ఉపక్రమించి, గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సోమవారం ఉదయం 5 గంటలకు రాజు రాగా, ఇంటి తాళాలు పగులకొట్టి ఉండటం, బీరువా ధ్వంసం చేసి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంటిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొని వెళ్లారు. ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందిన కొందరు యువకులు వాకింగ్కు వెళ్లగా, చెట్టు కింద నిద్రపోతున్న మోహన్ అనుమానాస్పదంగా కనిపించగా, అతడిని లేపి ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడిని తనిఖీ చేయగా, చోరీకి గురైన ఆరు తులాల బంగారు ఆభరణాలు దొరికాయి. మోహన్ను పోలీసులకు అప్పజెప్పారు. చోరీకి గురైన సొత్తు దొరకడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.