యాచారం, ఫిబ్రవరి 7: ఫ్యూచర్సిటీ కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. ఫ్యూచర్సిటీ కోసం చేపట్టే భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సర్పంచ్ వెన్నెల అధ్యక్షతన శనివారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు హాజరయ్యారు. ఫ్యూచర్సిటీలో భాగంగా గ్రామంలో 2,200 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నట్టు ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరిస్తామని, దీనికోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. నోటిఫికేషన్ అనంతరం పరిహారాన్ని ప్ర భుత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తమ ప్రా ణాలు పోయినా ఫ్యూచర్సిటీకి భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చిచెప్పారు. సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను తీసుకుంటే ఎలా బతకాలని బీఆర్ఎస్ నాయకుడు చిక్కుడు గుండాలు ప్రశ్నించారు.
రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసుల మాయమాటలు నమ్మి భూములిచ్చి మోసపోవద్దని ఆయన కోరారు. అసైన్డ్ భూములను నమ్ముకొని వరి, జొన్న, మక్కజొన్న, పత్తి, ఉలువలు, కందులు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్టు తెలిపారు. వ్యవసాయంతోపాటు గొర్రెలు, మేకలు, పశువులను పెంచుకుంటూ రైతులు జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి భూములను తీసుకుంటే తామంతా హైదరాబాద్కు వలస పోవాల్సి వస్తుందని రైతు లు వాపోయారు. భూ సేకరణ విషయమై ఎమ్మెల్యేను కలిస్తే తనకేమీ తెలియదనడం ఎంతవరకు సమంజసమని వార్డు సభ్యుడు వంగ సంజీవరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు తెలియకుండా సర్వే ఎలా చేశారని, ఎలా ఫెన్సింగ్ వేయడానికి వచ్చారని నిలదీశారు. దీంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని ఎమ్మెల్యేపై నిందలు వేయొద్దనడంతో బీఆర్ఎస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు.
ఏసీపీ రాజు, ఎస్సై మధు కల్పించుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా, రైతులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా భూముల్లోకి ఎలా వస్తారని వార్డు స భ్యుడు తలారి సత్యనారాయణ మండిపడ్డారు. భూసేకరణ పక్రియను ఆపేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సమాచారం లేకుండా భూముల్లోకి వస్తే తరిమికొడుతామని రైతులు హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్, ఎమ్మెల్యే అవసరమైతే సీఎంను కలుస్తామని వారు స్పష్టంచేశారు. భూ సేకరణ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు మాట్లాడుకున్న తరువాత మళ్లీ గ్రామసభ నిర్వహిస్తామని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.