రాజౌరి: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి పలు మార్లు సరిహద్దుల్లో డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజౌరి జిల్లా అధికారులు కొత్త ఆదేశాలను జారీ చేశారు. డ్రోన్లు, ఎగిరే వస్తువల వల్ల జాతి వ్యతిరేకులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, దాని వల్ల మనుషుల ప్రాణాలకు రిస్క్ ఏర్పాడుతున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఓ ప్రకటనలో భావించారు. ఈ సందర్భంగా రాజౌరి జిల్లా అధికారులు డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. డ్రోన్లను దాచిపెట్టడం, అమ్మడం, వాడడం, వాటిని రవాణాకు వాడడాన్ని నిషేధిస్తున్నట్లు రాజౌరి అధికారులు చెప్పారు. కానీ ఇప్పటికే డ్రోన్ కెమెరాలు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నవాళ్లు వాటిని పోలీసుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. సర్వేలు, మ్యాపింగ్, నిఘా కోసం ప్రభుత్వం వాడే డ్రోన్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు.