వికారాబాద్ : ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేస్తుండగా వికారాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎన్ కోటి రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటేశంకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పెద్దేముల్ ఎస్సై సిబ్బంది పెద్దేముల్ మండలం మంధాన పల్లి గ్రామం వద్ద బొలెరోలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
వాహన యజమాని ప్రేమ సింగ్, డ్రైవరు సంతోష్ నరసింఘ ను అదుపులోకి తీసుకుని విచారించగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోథీ కే గ్రామంలో ఎం జాకీర్ అలీ అనే వ్యక్తికి విక్రయించడానికి వెళ్తున్నట్లు వెల్లడించారని ఎస్పీ పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా జాకీర్ అలీ ఇంటికి వెళ్లి పరిశీలించగా అతడికిచెందిన డీసీఎం వ్యాన్లో 270 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించామని వివరించారు.
జాకీర్ అలీ ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మొత్తం 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు ఒక బొలెరో వాహనం, డీసీఎం ను సీజ్ చేశామని తెలిపారు. జిల్లా లో అక్రమ వ్యాపారాలు , అసాంఘిక కార్యకలాపాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.