Vikarabad | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ సమీపంలోని దామగుండంలో నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోనే అత్యంత అరుదైన ఔషధ మొక్కలు అంతర్థానమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. తమ ప్రకృతి సంపదను కాపాడుకొనేందుకు ఇప్పటికే పోరుబాట పట్టిన స్థానిక ప్రజలు, దామగుండం అటవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వికారాబాద్లో ఆదివారం చర్చావేదికను ఏర్పాటుచేశారు.
ఈ సమావేశంలోనే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. రాడార్ కేంద్రం కోసం 2,900 ఎకరాల అటవీ భూమిలో 12 లక్షలకుపైగా వృక్షాలను నరికివేయబోతున్నారు. ఆ చెట్లను, అ డవిని ఆవరించుకొని ఉన్న వెలకట్టలేని ఔషధ మొక్కలను కూడా ధ్వంసం చేయబోతున్నారని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా’ అన్న సామెత ఈ అడవులు వం దశాతం అద్దంపడుతాయని ఇక్కడ ఔషధ మొ క్కలపై పరిశోధన చేసిన నిపుణుల బృందం కూ డా చెప్తున్నది.
వికారాబాద్ అడవులు, ఇక్కడ దొరికే ఔషధ మొక్కలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇక్కడి ఔషధ మొక్కలపై జరిగిన ఓ పరిశోధన ‘బులెటిన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫార్మకాలజీ అండ్ లైఫ్ సైన్స్ 2017’లో ప్రచురితమైంది. ‘రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో లభించే ఔషధ మొక్కలు-జీవవైవిధ్యం’ పేరుతో ఈ నివేదకను ప్రచురించారు.
వికారాబాద్లోని ఎస్ఏపీ కాలేజీలో వృక్షశాస్త్ర విభాగం, మహారాష్ట్రలోని వాశీం జిల్లాలో ఉన్న పుష్పదేవ్ పాటిల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వృక్షశాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగాలకు చెందిన ఎన్ రామకృష్ణ, కేఎం రంజల్కర్, సీహెచ్ సైదు లు బృందం వికారాబాద్ అడవుల్లో పరిశోధన చేసింది. 2017 ఆగస్టు 19వ తేదీన వారి పరిశోధన పత్రం ప్రచురితమైంది.
ఒకేచోట అనేక ఔషధాలు
అద్భుతమైన ఔషధ మొ క్కలకు వికారాబాద్ అడవు లు నిలయమని ఈ పరిశోధకులు నివేదికలో పేర్కొన్నా రు. ‘దేశంలోని అనేక పర్వతప్రాంతాల్లో ఔషధ మొక్కలు లభిస్తాయి. కానీ, ఎక్కువ సంఖ్యలో అనేక జాతుల మొక్కలు ఒకే దగ్గర లభించడం అరుదు. 149 రకాల ఔషధ మొక్కల జాతులను ఇక్కడ గుర్తిం చాం. ఇవి 57 ఔషధ మొక్కల కుటుంబాలకు చెందినవి. తరతరాలుగా స్థానికులు వీటిని ఉపయోగిస్తున్నారు.
అద్భుతమైన ఔషధ విలువలు వీటి సొంతం. జంతువులకు సంబంధించిన ఔ షధాలు కూడా వికారాబాద్ అడవుల నుంచి ల భిస్తాయి. 1946లోనే నిజాం రాజు ఇక్కడ టీబీ చికిత్సకు ప్రత్యేక కేంద్రాన్ని నిర్మించారు’ అని వారు తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. వారు గుర్తించిన ఔషధ మొక్కల సమగ్ర వివరాలను నివేదికలో పొందుపరిచారు.
పాము, తేలుకాటు నుంచి రక్షించే మొక్కలతోపాటు దీర్ఘకాల చర్మవ్యాధులు, జీర్ణకోశ సంబంధ వ్యాధులకు, రక్తప్రసరణను మెరుగుపరిచే ఔషధ మొక్కల గురించి వివరించారు. ఈ ప్రాంతంలో లభించే భూగర్భవనరుల గురించి కూడా నివేదికలో తె లిపారు. ముఖ్యంగా మేలురకం సున్నపురాయి నిల్వలు కూడా ఉన్నాయని చెప్పారు. 173 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలు ఉన్నట్టుగా అంచనా వేశారు.
నష్టం అంచనాలే లేవు
వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడి అడవి, స్థానిక పరిస్థితులు, లాభనష్టాలపై కనీస అంచనా వేయలేదని నిపుణులు చెప్తున్నారు. ‘పర్యావరణ ప్రభావ అంచ నా’, ‘విపత్తు ప్రమాద అంచనా’, ‘జీవజాతుల పై రాడార్ తరంగాల ప్రభావ అంచనా’, ‘ఆర్థిక పరిస్థితుల అంచనా’, ‘వరదల ప్రభావ అంచ నా’ వంటివి చేయాల్సి ఉన్నది. ఆ అంచనాలను ప్రజల ఆమోదం కోసం గ్రామసభల్లో పెట్టాల్సి ఉంటుంది. ఔషధ మొక్కల పేటెంట్, వాటి వల్ల జరిగే మేలుపై అంచనాలు రూపొందించాలి. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవేవీ చేయలేదు. రేడియేషన్ వల్ల కలిగే లాభనష్టాల అంచనాలను కూడా ప్రజల ముందు పెట్టలేదు. వీటన్నింటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నేడు చర్చావేదిక
వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంపై చర్చించేందుకు దామగుండం అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యం లో ఆదివారం ఉదయం 10:30 గంటలకు చర్చావేదికను ఏర్పాటు చేశారు. స్థానిక బస్డిపో ఎదురుగా ఉన్న ఆర్ బాంక్వెట్ హాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. చర్చావేదికకు పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించినట్టు నిర్వాహకులు చెప్పారు. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, జరిగే దుష్పరిణామాలపై చర్చించేందుకు దీన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రకృతిని కాపాడుకోవడం మన ధర్మం
అడవిని, ప్రకృతిని కాపాడుకోవడం మన ధర్మం. ఇక్కడ భారీ వృక్షాలున్నాయి. అనేక ఔషధ మొక్కలకు నిలయం దామగుం డం పరిసర అడవులు. 2008-2010 మధ్యకాలంలో ఇక్కడి అడవిలో రాడార్ కేంద్ర ఏర్పాటు అంశం చర్చకు వచ్చినపుడు తీవ్రంగా వ్యతిరేకించాం. అటవీ భూమి బదిలీ నిలిచిపోయిందని భావించాం. కానీ, హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, రక్షణ శాఖకు అడవిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మేం న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేశాం. అటవీ అధికారులే స్వయంగా 12 లక్షల వృక్షాలను తొలగిస్తున్నట్టు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఒక్కటి చాలు ఇది ఎంత పెద్ద అడవో చెప్పడానికి. ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– సత్యానందస్వామి, దామగుండం
రేడియేషన్ భారీగా ఉంటుంది
వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే రేడియేషన్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక్కడి సమస్యలపై మేం స్థానిక ఎమ్మెల్యే రా మ్మోహన్రెడ్డికి అనేకసార్లు చెప్పాం. ధర్నాలు చేస్తాం.. మద్దతు ఇవ్వాలంటే ఇవ్వలేదు. అదిగో.. ఇదిగో అంటూ దాటవేశారు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి జిల్లా ఇది. ఆయనకు తెలియకుండానే ఈ తతంగం మొత్తం జరిగిందా? సీఎం దీనిపై జోక్యం చేసుకోవాలి. రాడార్ ఇక్కడ ఏర్పాటైతే కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. మేం ఈ అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయిస్తాం. ప్రజల నుంచి మరోసారి అభిప్రాయాలు సేకరించాలి.
– పోతిరెడ్డిపల్లి రామన్న, దోమ గ్రామం
గతంలోనే వ్యతిరేకించాం
మా పూడూరు పరిసరాల్లో రాడార్ కేంద్రం పెడ్తామంటే మేం వ్యతిరేకించాం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్.. ఇతర అధికారులకు కూడా చెప్పాం. కానీ, మా మాట వినలేదు. అడవిని కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం చేస్తాం. ఇక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదు.
-నర్సింహారెడ్డి, ప్రాథమిక సహకార కేంద్రం మాజీ చైర్మన్