ఆదిలాబాద్, మార్చి 20 ( నమస్తే తెలంగాణ): అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మం డలం అర్లీ(బీ)కి చెందిన రైతు తుడుం గణపతి (58) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతికి 5.16 ఎకరాల సొంతభూమి ఉండగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సోయాబీన్, పత్తి పంటలు సాగు చేశాడు. పెట్టుబడికి బ్యాంకులో రూ.3 లక్షల అప్పు తీసుకురాగా, ప్రైవేట్గా మరో రూ.3 లక్షల అప్పు తీసుకొచ్చారు. వానకాలంలో సోయా, పత్తి, జొన్న పంటలు సాగు చేయగా వర్షం కారణంగా పంట నష్టపోయాడు.
వచ్చిన కొద్ది పంటను ఆదిలాబాద్ మార్కెట్యార్డుకు తీసుకురాగా పంట నాణ్యత విషయంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది అభ్యంతరం తెలిపారు. దీంతో రైతు తన పంటను కొనుగోలు చేయాలని, లేకపోతే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ క్రమంలో గురువారం రాత్రి గణపతి పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు, బంధువులు గమనించి వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.