హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆడబిడ్డలు విజయతిలకం దిద్ది బస్సు యాత్రకు సాగనంపారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బస్సులోకి ఎక్కి విజయ సంకేతాన్ని చూపిస్తూ ఉత్సాహపరిచారు. బస్సులో కేసీఆర్కు మాజీ మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టారు.
గతానికి భిన్నంగా బస్సు తెలంగాణ భవన్ తూర్పు వైపు నుంచి ఈశాన్యం గేటు మీదుగా బయలుదేరింది. కార్యక్రమానికి హాజరైన వారిలో ఎంపీ సంతోష్కుమార్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టీ పద్మారావు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు బాలమల్లు, కర్నె ప్రభాకర్, మన్నె గోవర్ధన్ రెడ్డి, విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.