Land Grabbing | కరీమాబాద్, ఏప్రిల్ 11: కొందరు కాం గ్రెస్ నాయకులు తన భూమిని కబ్జా చేసి అందులో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖల మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశాడు.
గురువారం వరంగల్ ఫోర్ట్ రోడ్లోని ఈద్గా లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన బాధితుడు ఇక్బాల్.. చింతల్లోని సర్వే నంబర్ 444లో గల 275 గజాల తన స్థలాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని, వారి కబ్జా నుంచి తన స్థలాన్ని కాపాడి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు మంత్రి స్పందిస్తూ.. విచారణ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.