హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనాపై సామాజిక మాధ్యమాలు వేదికగా వెబినార్లు, అవగాహన సదస్సులు నిర్వహించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న వేణుగోపాల్రెడ్డి కరోనాపై నాలుగు నెలలుగా వేల మందికి అవగాహన కల్పించారు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ, వైరాలజీలో పీహెచ్డీ పూర్తిచేసిన ఆయన కొవిడ్పై స్వయంగా అవగాహన తెచ్చుకున్నారు. తనకు తెలిసిన విజ్ఞానాన్ని పదిమందికి పంచాలని భావించి, సోషల్మీడియా ద్వారా వైరస్పై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ భరోసా నింపుతున్నారు. ఆయన రూపొందించిన వీడియోలు ఏపీలోనూ పాపులర్ అయ్యాయి. అక్కడి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వేణుగోపాల్రెడ్డితో వెబినార్లను సైతం నిర్వహించాయి. ఏపీ ప్రభుత్వం సైతం రెండు వెబినార్లను నిర్వహించింది. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నారు. ఆయన చొరవకు ఫిదా అయిన వెంకయ్యనాయుడు శనివారం వేణుగోపాల్రెడ్డికి ఫోన్ చేసి అభినందించారు. కరోనాపై మీరు చేస్తున్న కృషికి అభినందనలు.. ఇదే చొరవను కొనసాగించండి అంటూ ఉత్సాహం నింపారు. సాక్షాత్తు ఉపరాష్ట్రపతి నేరుగా ఫోన్చేసి మాట్లాడంతో సదరు ప్రధానోపధ్యాయుడు ఉబ్బితబ్బిబవుతున్నారు.