హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సర్కార్ తాజాగా వెల్లడించిన కులాల గణాంకాలపై వివిధ బీసీ కులస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. లెక్కలు తప్పని, అసంబద్ధమని చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు, సర్కార్ డాటాకు ఏమాత్రం పొంతన లేదని చెప్తున్నారు. అయినప్పటికీ, ఈ గణాంకాలపై బీసీ సంఘాలు, ఆయా కుల సంఘాలు ఇప్పటివరకూ స్పందించకపోవడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024)కు సంబంధించి జస్టిస్ సుదర్శన్రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను సర్కార్ విడుదల చేసింది. రాష్ట్రంలో బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%, నో క్యాస్ట్ 4% ఉన్నారని వెల్లడించింది. అయితే, ప్రభుత్వ గణాంకాలపై గతంలో హడావుడి చేసి, నానా హంగామా చేసిన బీసీ సంఘాల ప్రతినిధులు, కులసంఘాలు ఒక్కరూ ఇప్పుడు స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. సర్కార్ లెక్కలపై ఆయా కులాలు, ఉపకులాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రభుత్వంతో అంటకాగుతూ..
వాస్తవంగా ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాల్లో అనేక లోపాలున్నాయని మేధావులు, కులస్తులు చెప్తూవచ్చారు. సర్వే ప్రారంభం కాకముందే కొన్ని సంఘాల నేతలు ఏకంగా ప్రభుత్వ పెద్దలను కలిసి సన్మానాలు చేశారని, అసలు ప్రభుత్వం సర్వే చేపట్టడమే మహా గొప్పనే తరహాలో ప్రచారం చేశారని గుర్తుచేస్తున్నారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే న్యాయపరంగా కొట్లాడుతామని నాడు ప్రకటనలు చేసిన ఆయా సంఘాల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం స్పందించడం లేదన్న భావన ఆయా కులాల్లో నెలకొన్నది. కేవలం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని, సర్కార్ మెహర్బానీ కోసం బీసీ హక్కులను తాకట్టుపెడుతున్నారని ఆయా కులాల ప్రజలు మండిపడుతున్నారు. చట్టాలను ఆచరణలోకి తీసుకొనిరాకముందే పలు బీసీ సంఘాల ప్రతినిధులు హడావుడి చేస్తూ, సర్కార్కు జేజేలు కొట్టడం, ఢిల్లీకి తరలివెళ్లి కాంగ్రెస్కు మద్దతుగా ధర్నా నిర్వహించడం, కాంగ్రెస్ పెద్దలకు సన్మానాలు చేయడం అందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.
రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతోనే కలిసి బంద్ నిర్వహించడం, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకున్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓ బీసీ సంఘం నాయకుడు వ్యవహరించారని వివరిస్తున్నారు. మరో బీసీ నేత బీజేపీకి వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ప్రభుత్వం తమ జనాభాను తగ్గించి చూపినా సంఘాల నేతలు స్పందించడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓ బీసీ నాయకుడు ఏకంగా కాంగ్రెస్ లీడర్గా మారిపోయాడని విమర్శిస్తున్నారు. ‘బీజేపీ నాయకులకు బీసీలకు జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా? బీసీల్లో షేక్లే ఎకువ ఉన్నారంటే బడుగు, బలహీన వర్గాలు ఏమైపోయాయి? ఎందుకు బీజేపీ మాట్లాడదు?’ అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ లెకలకు శాస్త్రీయత లేదని, తప్పుడు లెక్కలు బలవంతంగా రుద్ది బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై కుల సంఘాల రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.