ముషీరాబాద్, మార్చి 20: ఎస్సీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసెత్తకుండా మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. కుటుంబ పాలనను అంతం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ సీటును వెంకటస్వామి కుటుంబానికి ఇచ్చి కుటుంబ పాలనను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెద్దపల్లి ఎంపీ సీటు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బుధవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. మాదిగ, ఉపకులాలు ఏకమై మోసపూరిత వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను, దళిత మంత్రులను బహిరంగంగా అవమానిస్తున్నదని మండిపడ్డారు. బీసీలు, దళితులను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని తూర్పారబట్టారు. ఇందిరమ్మ రాజ్యస్థాపన అంటే దళితులను అణగదొక్కడమేనా అని ఎద్దేవా చేశారు. దళితులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా మిగతా సీట్లను మాదిగలకు కేటాయించాలని, లేనిపక్షంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామంటూ రేవంత్రెడ్డి చెప్పిన దళిత డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం 17 మంది అగ్రవర్గాల వారికే ప్రాధాన్యతమిచ్చిందని, మాదిగలకు ఒకే ఒక్క చైర్మన్ పదవి ఇచ్చి తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.