ముషీరాబాద్, జనవరి 16: కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ విమర్శించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాయమాటలు చెప్పి మళ్లీ కమిటీలంటూ కాలయాపనకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్లోని విద్యానగర్ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ సాధ్యమని చెప్తూ వస్తున్న మంద కృష్ణమాదిగ వర్గీకరణ అంశాన్ని పక్కదారి పట్టించేలా సుప్రీంకోర్టులో కేసు ఉన్నదంటూ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని ఆరోపించారు. మంద కృష్ణ వైఖరి వల్లే వర్గీకరణ జాప్యం జరుగుతున్నదని విమర్శించారు. ఈ నెల 31న జరిగే చివరి పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.