హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు అంబేద్కర్కు దండలేయడం అంటే ఆ మహానుభావుడిని అవమానించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అఢ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బోడుప్పల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇస్తామని చెప్పిన విద్యా సహాయం ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ సబ్ప్లాన్ కింద ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వకపోగా ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. చేవెళ్ల డిక్లరేషన్కు తూట్లు పొడిచి నేడు దళితుల పక్షపాతిగా మాట్లాడటం అంబేద్కర్ను అవమానించడమేనని దుయ్యబట్టారు. పత్రికా ప్రకటనల్లో మాదిగ మంత్రి ఫొటో లేకుండా చేశారని, ఇది మాదిగలను అవమానించడమేనని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్తోపాటు కడియం శ్రీహరి ఫొటోలు ప్రచురించారని గుర్తు చేశారు.