అబిడ్స్, ఏప్రిల్ 2 : సామాన్య కల్లుగీత వృత్తి చేసుకుంటూనే బహుజన రాజ్యాన్ని నిర్మించిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అంబాల నారాయణగౌడ్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో గౌడ సంఘాల సమన్వయ కమిటీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని నాడు వేల బహుజనుల సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఒక్కొక్క కోటకు ఒక్కొక్క బహుజనుడిని రాజుగా చేసిన గొప్ప చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ట్యాంక్బండ్పై ప్రభుత్వం నెలకొల్పే పాపన్న విగ్రహ రూపకల్పనకు బీసీ, గౌడ సంఘాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పాపన్న కోటలను పరిరక్షించాలని, పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, పార్కులు, నూతనంగా నిర్మించే కారిడార్లు, రోడ్లకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, విప్లవ గాయనీ విమలక్క, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ ప్రసంగించి.. సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల బంధువని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ హేట్ స్పీచ్ బిల్లు-2026’ను వెంటనే ఉపసంహరించాకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ‘మొహబ్బత్కి దుకాన్’ అంటూ దేశమంతా రాహుల్గాంధీ తిరుగుతుంటే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఆ దుకాన్ను హైదరాబాద్లో తగులపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు అనేది అశాంతి, వ్యతిరేక భావాలు అనే అస్పష్టమైన పదాలతో ప్రజలను జైలుకు పంపించే బిల్లు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి అవినీతి, వైఫల్యాలను ప్రశ్నించే నోళ్లను మూయించేందుకే ఈ బిల్లు తెచ్చారని ఆరోపించారు. 2013లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ను చింపేసిన రాహుల్గాంధీ ఇప్పుడు రేవంత్ నిరంకుశ బిల్లు తెచ్చినా నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.