V Hanumantha Rao | హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహబూబ్నగర్ ఎంపీ స్థానం నుంచి వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించారు. దీంతో ఏ స్థానానికి ఎవర్నీ ప్రకటిస్తారనేది కాంగ్రెస్ పార్టీలో చర్చానీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతాను అని వీహెచ్ తేల్చిచెప్పారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఖమ్మం ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయంపై పోరాడాను. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు ఉన్నారా..? సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉంది. కొత్తవాళ్లు టికెట్లు అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితి ఏంటీ..? గత ఎన్నికల్లో కూడా తనకు అన్యాయం జరిగిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నందిని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తాను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని సహచరులతో చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆమెకు టికెట్ ఖరారు కావడంతోనే రేణుకా చౌదరిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వీహెచ్కు ఖమ్మం ఎంపీ టికెట్ వస్తుందో.. రాదో వేచి చూడాల్సిందే.