V Hanumantha Rao | హైదరాబాద్ : ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మీద పగ పట్టిండు, కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దయవల్లే ఈ స్థాయికి ఎదిగాను అని వీహెచ్ స్పష్టం చేశారు. గత ఏడు, ఎనిమిది ఏండ్ల నుంచి తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు.. స్టార్ క్యాంపెయిన్లో చోటు ఇవ్వలేదు. అయినప్పటికీ తనకు ప్రజల్లో అభిమానం ఉంది. ఎవరు తనకు వ్యతిరేకం చేసిన ఆ భగవంతుడు ఉన్నాడని వీహెచ్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డారు.. ఆయనే సీఎం కావాలన్నాను.. అందులో తప్పేముంది..? పార్టీ బలోపేతానికి రేవంత్ ఎంతో కృషి చేశారు. న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ దీన్ని గమనించి తనకు న్యాయం చేయాలి. హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి తిరిగితే.. తాను కార్లలో తిరిగి ప్రచారం చేశాను. భారతదేశంలో హనుమంతరావు అంటే తెలియని వారు లేరు. భట్టి విక్రమార్క సీఎల్పీ స్థాయికి ఎదిగేందుకు తన సహాయం కూడా ఉంది. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగేందుకు భట్టి విక్రమార్కకు తాను సహాయం చేస్తే.. ఇవాళ్నేమో ఆయన తనను వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం టికెట్ వస్తే తప్పకుండా గెలుస్తా. రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లీమెంట్ చేస్తాను. ఖమ్మం ప్రజలు తనను కోరుకుంటున్నారు. బీసీలు అవసరం లేదా..? బీసీలు ఓట్లు వేసే మేషిన్లమా.. న్యాయం జరగదా..? తాను ఎంతో మందికి సహాయం చేశాను. రాజశేఖర్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్గా చేసింది కూడా తానేనని వీ హనుమంతరావు పేర్కొన్నారు.