Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ పోరులో అసలు కాంగ్రెస్దే పైచేయిగా నిలిచింది.
ఉత్తమ్, రేవంత్ మధ్య నిరుద్యోగ నిరసన దీక్ష అగ్గి రాజేసింది. ఈ నెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్షను నిర్వహిస్తున్నట్టు మంగళవారం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటనపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తనతో చర్చించకుండా, తన జిల్లాలో ఏ విధంగా సభ నిర్వహిస్తారని బహిరంగంగానే నిలదీశారు. రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతోపాటు రేవంత్రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్నటు వీరిద్దరి మధ్య ఈ సభ మరింత దూరం పెంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పార్టీలో రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం, అసహనంతో ఉన్న సీనియర్లకు నిరుద్యోగ నిరసన సభ ప్రకటన మరింత ఆగ్రహం తెప్పించింది. ఇక తాడోపేడో తేల్చుకొనేందుకు ఉత్తమ్ సిద్ధమైనట్టు తెలిసింది. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ‘ఈ సభతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం పీసీసీనే చూసుకొంటుంది. నేను కూడా సభలో పాల్గొనబోను’ అని ఉత్తమ్ కుమార్రెడ్డి అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ విషయంపై ఆరా తీసిన కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఉత్తమ్ కుమార్రెడ్డి సభకు రాకపోయినా, జనాల్ని తరలించకపోయినా… సభ అట్టర్ఫ్లాప్ కావడం ఖాయమనే అభిప్రాయానికి అధిష్ఠానం పెద్దలు వచ్చినట్టు సమాచారం. ఇదే జరిగితే ఈ సభ పార్టీకి మరింత నష్టం చేస్తుందని భావించి రేవంత్రెడ్డికి ఫోన్ చేసి మొట్టికాయలు వేసినట్టు చెప్తున్నారు. నిరుద్యోగ నిరసన సభను రద్దు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో చేసేదేమిలేక సభను రద్దు చేస్తున్నట్టు పీసీసీ ప్రకటించింది.