హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి కనీసం రూపాయి కూడా తేనోడికే మాటలెక్కువ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
మూడేండ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో తమకు పుట్టగతులుండవనే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడాన్ని బీజేపీ నాయకులు జీర్జించుకోలేక పోతున్నారని, అందుకే నిధులు విడుదల చేయకుండా కేంద్రం మోకాలడ్డుతున్నదని ఆరోపించారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలిపారు.