హైదరాబాద్, మార్చి 12 : ఉత్తరప్రదేశ్ ఫార్ములా తెలంగాణలో పనిచేయదని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలపై తమకు అసంతృప్తి లేదని చెప్పారు. శనివారం ఆయన మంత్రి కే తారకరామారావుతో అసెంబ్లీ లాబీలో భేటీ అయ్యారు. అనంతరం అసదుద్దీన్ మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా యాక్టివ్గా ఉన్నారని, ఉత్తరప్రదేశ్ ప్రభావం తెలంగాణ మీద ఉండదని చెప్పారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఫలితాలను వేరువేరుగా చూడాలని వ్యాఖ్యానించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంచిమాటకారి అని పేర్కొన్నారు. ఎన్నికలు ఒక ఆట లాంటివని, ఒకసారి ఓడిపోతామని, ఒకసారి గెలుస్తామని అన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రి కేటీఆర్ను కలిసినట్టు వివరించారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కోసం తాను కలవలేదని స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాన్షీరాం స్ఫూర్తితో పనిచేస్తామని అన్నారు. పోటీ చేయడం, ఓడించడం, గెలవడమే తమ విధానమని చెప్పారు. కాంగ్రెస్ చాలా రాష్ర్టాల్లో బలహీనపడిందని చెప్పారు. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తన క్వార్టర్ను ఖాళీ చేయాల్సిన గడువును పొడిగించేందుకు ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు రావటం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆజాద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా బీజేపీ తమకు శత్రువేనని స్పష్టంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల మద్దతు తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఎన్ని సీట్లలో పోటీచేస్తామో ఎన్నికల సమయంలోనే వెల్లడిస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. జనాభా ప్రాతిపదికన చూస్తే ఉత్తర భారతం కంటే దక్షిణ భారతం తీవ్రంగా నష్టపోతున్నదని పేర్కొన్నారు.