హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50 వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. ధ్వంసమైన పంటల విలువ రూ.100 కోట్లకుపైగా ఉంటుందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. బలమైన ఈదురు గాలులతో వరి పైరు, మొక్కజొన్న నేలకొరుగుతుంటే.. వడగండ్లతో వరి గొలుసులు, మామిడి పూత, కాయలు రాలిపోతున్నాయి. ఓ వైపు కరువు, మరోవైపు వడగండ్లతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పంటలను కాపాడుకునే దిక్కులేక రోదిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయశాఖ ఆరా తీసింది.
శనివారం నుంచి సోమవారం వరకు కురిసిన వానలకు సుమారు 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. మంగళవారం కూడా సిద్దిపేట, సిరిసిల్లతోపాటు ఇతర జిల్లాల్లోనూ భారీగా వడగండ్ల వానలు పడ్డాయి. పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దెబ్బతిన్న పంటల్లో వరి 30 వేల ఎకరాలు ఉండగా మామిడి, ఇతర కూరగాయలు, ఉద్యాన పంటలు కలిపి మరో 20 వేల ఎకరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఇక 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా.. దీని విలువ రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరి, మక్కజొన్న, ఇతర ఉద్యాన పంటలకు రైతులు పెట్టిన పెట్టుబడి ఆధారంగా పంట నష్టం అంచనా వేశారు.
అకాల వర్షాలతో పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. పంట నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించే దిక్కు లేకుండా పోయింది. మంత్రులుగానీ ఎమ్మెల్యేలుగానీ రైతులను పరామర్శించిన పాపానపోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు మార్చి, ఏప్రిల్ నెలలో ఇదే మాదిరిగా వడగండ్ల వర్షాలు కురిశాయి. మార్చి వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో, ఏప్రిల్ వర్షాలకు 3.04 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి అక్కడికక్కడే నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారాన్ని అందించాలని ఆదేశించారు.
ఇందుకోసం రూ.456 కోట్లు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం.. రైతులకు పరిహారాన్ని అందించి కష్టకాలంలో అండగా నిలిచింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆ పరామర్శలకు, భరోసాకు నోచుకోవడం లేదు. అయితే, పంటనష్టం పూర్తిగా అంచనా వేసిన తర్వాత పరిహారం ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగానే ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరిహారాన్ని ప్రకటించొచ్చా లేక ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా అనే అంశంపై చర్చిస్తునట్టు తెలిసింది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గానీ, వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.
మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఇప్పటికే రెండు మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్కు తీసుకొచ్చిన పంటలు వర్షాలకు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.