(నమస్తే తెలంగాణ, న్యూస్నెట్వర్క్) ;అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాలివాన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి కురిసిన గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. నిమ్మతోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇండ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. చాలా చోట్ల వడ్లు తడిసిపోగా రైతులు కన్నీరు పెడుతున్నారు. సోమవారం వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసలే నీళ్లు లేక అరకొరగా పండిన ధాన్యం ఇప్పుడు ఇలా తడిసి నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కేంద్రాల్లో వసతులు కల్పించాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు.ఇక కరీంనగర్లో పిడుగుల శబ్దం దద్ధరిల్లింది. కామారెడ్డి ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వెనుక ఓ చెట్టు నేలకూలింది. నవీపేట మండలంలోని మోకన్పల్లిలో పిడుగుపాటుకు మిర్యాల ఒడ్డెన్నకు చెందిన ఆవు మృతి చెందింది. దోమకొండలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. మహబూబాబాద్ జిల్లా సత్యనారాయణపురం గ్రామంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.