నమస్తే తెలంగాణ, నెట్వర్క్, ఏప్రిల్ 30: అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. ఆదివారం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్ల కారణంగా వరిచేళ్లలో ధాన్యం రాలిపోయింది. పలుచోట్ల పిడుగులు పడటంతో ఇద్దరు మరణించారు. చేతికందాల్సిన పంట నేలపాలు కా వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర నుంచి గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లింగంపేట, ఎక్కపల్లి, సజ్జన్పల్లి, శెట్పల్లిసంగారెడ్డి, మెంగారం, లింగంపల్లి, ముస్తాపూర్, ఎల్లారం తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కారణంగా ధాన్యం పూర్తిగా రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బిచ్కుంద మండలంలో వడగండ్ల వాన కురిసింది. లింగంపేట్ మండలం మెంగారం శివారులో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్ర ధాన రహదారిపై మర్రి వృక్షం, శెట్పల్లిసంగారెడ్డి గ్రామ రహదారిపై మరో చెట్టు నేలకొరిగింది. ఎక్కపల్లిలో చెట్టు కూలడం ఓ ఇల్లు స్వ ల్పంగా ధ్వంసమైంది. మెంగారం శివారులో ప్రధాన రహదారిపై భారీ మర్రి చెట్టు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిం ది. పిట్లంలో కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాల వద్ద కుప్పలు పోసిన ధాన్యం కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మం డలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వడగండ్ల వాన కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలం, పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్, మండలాల్లో కురిసిన వర్షంతో కోతకొచ్చిన వరి దెబ్బతిన్నది. మామిడిపండ్లు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధా న్యం తడిసింది. పలు గ్రామాల్లో స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. అక్కడక్కడా రోడ్లపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం సాయంత్ర భారీ వర్షం పడింది.
జనగామ, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీగా, ములుగు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వరంగల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక తోపాటు మర్కూక్, జగదేవ్పూర్ మండలాల్లో భారీ వర్షం పడింది. మర్కూక్ మండలం చేభర్తి, నర్సన్నపేట, గణేశ్పల్లి, ఎర్రవల్లి తదితర గ్రామాల్లో వడగండ్లకు వరి, కూరగాయ పంటలతోపాటు పండ్లతోటలు దెబ్బతిన్నాయి. జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట, తిమ్మాపూర్, అనంతసాగర్, గొల్లపల్లి, మునిగడప, చాట్లపల్లి, చిన్నకిష్టాపూర్, ఎల్లాయగూడెం, పీటీ వెంకటాపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం నేలరాలింది. మిర్చి, టమాట, మామిడి తోటలకు నష్టం జరిగింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది.
గ్రేటర్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూ డిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
జగిత్యాల జిల్లా కాల్వశ్రీరాంపూర్ మం డలం వెన్నంపల్లిలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి జంగం కొమురయ్య(47) మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడులో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. సింగారంలో ధాన్యం తడిసింది. శాలిగౌరారం మార్కెట్ యార్డ్, అడ్లూర్, గురజాల, ఎన్జీకొత్తపల్లి, తిర్మలరాయినిగూడెం, మాదారం కలాన్, చిత్తలూర్ గ్రామాల్లో ధాన్యం తడిసింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురంలో పిడుగుపాటుతో గొర్రెల కాపరి సైదులు (32) మృతిచెందాడు.