హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొడుకుపై పోక్సో కేసు నమోదై 24 గంటలు దాటినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మౌనం వహించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ ఆయన నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొడుకు భగీరథ్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి బలమైన అధారాలుండడంతోనే ఆయన నోరు విప్పేందుకు జంకుతున్నారా?, ప్రధాని మోదీ పర్యటన సమయంలో ఈ వ్యవహారంపై మాట్లాడితే మరింత దుమారం రేగుతుందని వెనుకడుగు వేస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. ఇటీవల తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై అనుచరులను ఉసిగొల్పి దాడులు చేయించిన బండి.. కొడుకుపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని పలువురు భావిస్తున్నారు. ఆయనకు రాజకీయంగా పెద్ద దెబ్బెనని విశ్లేషిస్తున్నారు.
మద్దతివ్వని పార్టీ నాయకత్వం
బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం సైతం స్పందించకపోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తప్పు జరిగిందని నమ్ముతున్నందునే బండి సంజయ్కు మద్దతు ఇవ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 17 ఏండ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు, పోక్సో కేసు తీవ్రత దృష్ట్యా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తయ్యేదాకా వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్న ప్రధాని మోదీ తాజా పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తారోనని భయపడుతున్నారు. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.