అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం తలసరి చెట్లు ఎక్కువగా ఉన్న దేశం కెనడా. 2050 వరకు చైనాలో 5వేల కిలోమీటర్ల పొడవునా, వేల కోట్ల మొక్కలు నాటేందుకు జరుగుతున్న కార్యక్రమం అందరికీ ఆదర్శం. అడవుల పెంపకంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. బ్రెజిల్ రెండో అతిపెద్ద ప్రయత్నంగా అమెజాన్ అడవులను పరిరక్షించుకొంటున్నది. వీటిని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అదేవిధంగా తెలంగాణలో హరితహారం మూడో అతిపెద్ద ప్రయత్నం.
– 2021 అక్టోబర్1న అసెంబ్లీలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. అతి తక్కువ కాలంలో చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రాలు సాధించలేని ఘనతను సాధించింది. తెలంగాణ సాధించిన ఈ ఘనతను కేంద్ర మంత్రులు పార్లమెంట్లో వెల్లడించారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం పెరిగిందని, అత్యధిక మొక్కలు పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర మంత్రి లోక్సభలో, రాజ్యసభలో ప్రకటించారు.
కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అశ్వనీ చౌబే సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు బదులిస్తూ.. మొక్కల పెంపకంలో తెలంగాణ ముందున్నదని వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రామ్దాస్ సీ తదాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019-20 నుంచి 2021-22 వరకు మూడు సంవత్సరాల్లో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 411.96 కోట్ల మొక్కలు నాటగా ఇందులో 85.62 కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలోనే నాటారు. మొక్కలు నాటిన రాష్ర్టాల్లో తెలంగాణ వాటా 21 శాతం అని మంత్రి తెలిపారు. గ్రీన్ కవర్ ఉన్న మెగాసిటీల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని ఐదు రోజుల క్రితమే కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.
కేసీఆర్ సంకల్పమే హరితహారం
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు, జనారణ్యంలోకి వస్తున్న కోతుల లాంటి జంతువులను తిరిగి అడవుల్లోకి పంపడానికి మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి రోడ్డు ఎక్కడ అనువైన స్థలం ఉంటే అక్కడ మొక్కలు పెంచుతున్నారు. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 268.13కోట్ల మొక్కలను నాటారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్లో కూడా గత మూడేండ్లలో 78.99 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే అతి తక్కువ సంఖ్యలో మొక్కలు నాటాయని కేంద్రం తెలిపింది.
మొక్కల పెంపకానికి రూ.9 వేల కోట్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొక్కల పెంపకానికి అటవీ శాఖతో సహా వివిధ శాఖలు దాదాపు రూ.9 వేల కోట్ల వరకు ఖర్చు చేశాయి. హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకపోవడానికి హరితనిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తోడ్పాటునందిస్తున్నారు. షాపులకు కొత్త లైసెన్స్లు, రెన్యూవల్, విద్యార్థుల అడ్మిషన్ సమయంలో హరితనిధికి జమ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పార్కులను ఏర్పాటు చేస్తున్నారు.
స్థానిక సంస్థల్లో
సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో ఒక పార్కు ఉండే విధంగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 19 వేల అవాసాలు, గ్రామ పంచాయతీల్లో పార్కులను ఏర్పాటు చేశారు. ప్రతి పట్టణంలో వార్డుకో ట్రీ పార్కును ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 2700 ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు సీఎం కేసీఆర్ పకడ్బందిగా చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు కనీసం 85 శాతం మొక్కలు బతకాలని నిబంధన విధించారు. ఒక వేళ మొక్కలు బతకకుంటే సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులను బాధ్యులను చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పట్టణాల స్థానిక సంస్థల బడ్జెట్లో కనీసం 10 శాతం ఖచ్చితంగా హరితహారానికి, మొక్కల పెంపకం, సంరక్షణ, నర్సరీలు తదితర వాటి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.
విస్తీర్ణం పెరిగింది
తెలంగాణలో గ్రీన్ కవర్ 18 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగిందని కేంద్ర మంత్రి ఇటీవలే రాజ్యసభకు తెలిపారు. 2015లో తెలంగాణలో గ్రీన్ కవర్ 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2021 నాటికి అది 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందున్నదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
హైదరాబాద్కు అంతర్జాతీయ అవార్డు
పచ్చదనం పెంపుపై హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్సిటీ అవార్డు దక్కింది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అవార్డునూ హైదరాబాద్ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. భారతదేశం నుంచి ఈ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క సిటీ హైదరాబాద్ కావడం విశేషం. హైదరాబాద్ నగరంలో పచ్చదనం 33.15 చదరపు కిలోమీటర్ల నుండి 81.81చదరపు కిలోమీటర్లకు (246 శాతం) పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని 129 ప్రదేశాలలో 188 ఫారెస్టు బ్లాకులు అభివృద్ధి చేశారని, మొత్తం 1.6 లక్షల ఎకరాల భూమిని పునరుజ్జీవింపజేశారని తెలిపింది.