Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో 400కుపైగా హామీలు ఇచ్చిందని, గెలిచిన తర్వాత ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘రైతు దీక్ష’లో ఆయన పాల్గొని మాట్లాడారు. వంద రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి అనేకచోట్ల చెప్పారన్నారు. ముఖ్యంగా రైతుల కష్టాలు తీరుస్తామని చెప్పి, ఆశలు రేకెత్తించి, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారని మండిపడ్డారు.
రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని, కొత్తగా రుణాలు తీసుకోవద్దని, డిసెంబరు 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన మాటలను నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే రైతులను మోసం చేశారన్నారు. అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు దళారీల దగ్గర మిత్తీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తున్నదని చెప్పారు. ‘కాంగ్రెస్ గ్యారంటీ అంటే.. ప్రజలను మభ్యపెట్టే, మోసం చేసే గ్యారంటీ. రైతులకు వెన్నుపోటు పొడిచే, దగా చేసే గ్యారంటీ’ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలుపై శ్రద్ధ లేదని, వసూళ్లు చేసి ఢిల్లీకి పంపడం పైనే శ్రద్ధ ఉన్నదని ఆరోపించారు. తక్షణమే రూ.2లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు, వరికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో రేవంత్ రెడ్డి స్ఫష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆర్థిక సాయం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కావాల్సిన నిధులు ఏవిధంగా సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ.2,200 చెల్లిస్తున్నదని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కలిపి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులకు ఇచ్చిన అన్ని హామీలపై, గ్యారంటీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రాహుల్ గాంధీ తన జీవితంలో ప్రధానమంత్రి కాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేదాకా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు.