హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలు రుణాలిచ్చిన మేడిగడ్డ కుంగిపోతే కేంద్ర మంత్రిగా ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్రెడ్డి చేసిన సవాల్కు ఉత్తమ్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ… కిషన్రెడ్డి కాంగ్రెస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ పదేండ్లపాటు కలిసి పనిచేసి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 రోజులు కూడా కాని తమపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరంలో అవినీతికి కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. నిబంధనలు మార్చడం ద్వారా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.1.25 లక్షల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రూ.60 వేల కోట్లు రుణాలు ఇచ్చిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని ప్రభుత్వాల అవినీతిపై కేసులు పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు ఎందుకు పెట్టలేదని, విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నదని, సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విధంగా వారం రోజుల్లోనే జ్యుడీషియల్ విచారణ వేయబోతున్నామని ప్రకటించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.