సూర్యాపేట, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన జన గర్జన సభ జనం లేక వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభ ఫ్లాప్షోగా మిగిలిపోయింది. 30 వేల మంది జనం వస్తారని, ఆ మేరకు కుర్చీలు ఏర్పాటు చేయగా.. పట్టుమని 10 వేల మంది కూడా రాలేదు. దాంతో ఆ పార్టీ నేతలు విస్తుపోయారు.
అమిత్ షా, బీజేపీ సూర్యాపేట అసెంబ్లీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు ఖాళీ కుర్చీలకే ప్రసంగం వినిపించాల్సి వచ్చింది. అమిత్షా మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోవడం కనిపించింది. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ప్రసంగం 45 నిమిషాలు ఉండగా.. జనం లేకపోవడంతో 12 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగంలో కూడా పసలేదని, మొక్కుబడిగా సాగిందని బీజేపీ శ్రేణులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశాయి. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించినా 10 వేలకు మించకపోవడంతో ఇలాంటి సభలు ఎందుకు పెడతారని ఆ పార్టీ అగ్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.