హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియో -ఎంఎంఆర్) గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ (ఎస్ఆర్ఎస్) విడుదల చేసిన (2018-20) నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం స్పందించి మాతృ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) తగ్గుదలలో తెలంగాణ చక్కటి పనితీరు కనబర్చిందని ప్రశంసించారు.
కేంద్రం నిర్దేశించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’కు (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) అనుగుణంగా దేశంలోని 8 రాష్ర్టాల్లో ఎంఎంఆర్ తగ్గిందని చెప్పారు. 2014-16లో జాతీయ సగటు ఎంఎంఆర్ 130 ఉండగా, తాజా నివేదికలో 97కు తగ్గిందని పేర్కొన్నారు. 2030 నాటికి 70కి తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలతోపాటు దవాఖానలను బలోపేతం చేయడం వల్ల రాష్ట్రంలో 2017-19లో ఎంఎంఆర్ 56 ఉండగా, ఇపుడు 43కు తగ్గిపోయింది. రాష్ట్రంలో మాతృ మరణాలు తగ్గడంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించా రు. రాష్ట్రంలో ఎంఎంఆర్ (మెటర్నల్ మోర్టాలిటీ రేషియా), ఐఎంఆర్ (ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో)ను తగ్గించేందుకు విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారని ట్విట్టర్లో ప్రశంసించారు.
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తున్నది
రాష్ట్రంలో ఎంఎంఆర్ తగ్గినట్టు కేంద్రం ప్రకటించడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పారు. కేసీఆర్ కిట్ పథక ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ ఊహించిన ఫలితాలనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ వెల్లడించిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతుందనడానికి తాజా నివేదిక నిదర్శనమని పేర్కొన్నారు.