Assembly Seats | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని, అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. పార్లమెంట్లో ఏపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
గత ఏడాది సైతం కేంద్రం పార్లమెంట్లో ఇదే విషయం తెలిపిన విషయం తెలిసిందే. 2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, సీట్లు పెంచే ఆలోచన లేదని కేంద్రం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం.. 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని చెప్పింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి.. ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎలాంటి పక్షపాతం లేకుండా.. ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు’ ఉంటుంది అని కేంద్రం పేర్కొంది.