ఎల్బీనగర్, మార్చి 12: నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఏ ఒక్క నిరుద్యోగి ప్రాణం పోయినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్ చైతన్యపురిలో నిరుద్యోగ ఉద్యమ నేత పాలకూరి అశోక్ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని మంగళవారం వారు సందర్శించి, సంఘీభావం తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగుల గొంతుకగా అశోక్తోపాటు వారి బృందం నిరాహారదీక్ష చేయడం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగ నేతలపై నిర్బంధం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు అన్ని పోస్టులను బ్యాక్లాగ్ లేకుం డా భర్తీ చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత గురుకుల విద్యాలయాల్లో 9,200 పోస్టులను బ్యాక్లాగ్ లేకుండా నింపాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారని, దీనికి సీఎం చొరవ చూపాలని హితవు పలికారు.
నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు
నిరుద్యోగుల సమస్యలపై స్పందించకుంటే రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేను, ఎంపీని తిరగనివ్వబోమని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. నిరుద్యోగుల పక్షాన ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. పేదలు చదివే పాఠశాలల్లో అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.గ్రూప్ 1, 2, 3 పోస్టుల సంఖ్యనూ పెంచాలని కోరారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపాలని ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు.